ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ, పీజీ మరియు వృతి విద్యా
కోర్సు లకు అమలు అవుతున్న ఫీజు రియెంబర్సుమెంట్ పథకం విషయం లో ఎలా వ్యవహరించాలో తెలియడం
లేదు. ఈ పథకం కోసం -వివిధ పత్రికలలో వస్తున్న సమాచారం ప్రకారం- ప్రభుత్వం గత ఆర్ధిక
సంవత్సరం లో 3000 కోట్ల రూపాయల వరకు భరించింది. ఇందులో సగానికి పైగా (సుమారు 1772
కోట్ల రూపాయలు) ఇంజనీరింగ్,
మెడిసిన్ లాంటి వృత్తి కోర్సు ల కోసం చెల్లించింది. కాలేజీ ల సంఖ్య ప్రకారం చూస్తే,
ఇందులో ఇంజనీరింగ్ దే సింహభాగం అయి ఉటుంది అనడం లో సందేహం లేదు. ఇంజనీరింగ్ ఫీజులు
పెరుగబోతున్న నేపధ్యం లో- సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏకీకృత ఫీజు మరియు
ఇంజనీరింగ్ కాలేజి లు అధ్యాపకులకు ఇస్తున్న వేతనం ఆధారం గా ఫీజు లు వసూలు చేసే
అవకాశం వలన - ఈ పథకం ప్రభుత్వానికి పెనుభారం గా పరిణమించబోతోంది అంటున్నారు. (ఈ
ఆర్థిక సంవత్సరం లో 3500 నుంచి 4000 వరకు పెరిగి , తరువాత ప్రతి సంవత్సరం కొంత శాతం పెరగవచ్చు అని అంచనా
వేస్తున్నారు) . వెనుకబడిన
విద్యార్థుల ఉన్నత విద్య కోసం వార్షిక బడ్జెట్ లో నాలుగు శాతం లోపు ఖర్చు
ప్రభుత్వానికి నిజంగా పెనుభారమా?
ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలలో అధికార పార్టీ ల రాజకీయ ప్రయోజనాలు కలిసి ఉండడం సాధారణమైన విషయమే అయినా, ఫీజు రియెంబర్సుమెంట్ పథకం ఓట్ల కోసమే కాకుండా సంక్షేమం ముసుగులో ప్రజల
సొమ్మును తమకు నచ్చిన వారికి పంచి పెట్టడానికి కూడా ఉద్దేశించిన పథకం. (రాజకీయ పార్టీలు
వాటి సిద్దాంతాలను అమలు పరచడానికి అధికారం సంపాదించడం అనేది రాజకీయ ప్రయోజనం గా
ఉండడం నుంచి, ప్రభుత్వాధినేతలు- పార్టీ
నేతలకు, వారి అనుచరులకు- ప్రజల సొమ్ము దోచి పెట్టడంమే రాజకీయ ప్రయోజనానికి ప్రస్తుత
అర్థం అవ్వడం వేరే విషయం). భారతదేశంలో మరియు విదేశాలలో సాఫ్ట్ వేర్ జాబ్ అవకాశాలు పెరిగిన తరువాత ఇంజనీరింగ్ చదువు కు క్రేజ్ పెరగడం, స్వదేశం లోనో లేదా విదేశం లోనో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు
చేస్తున్న అబ్బాయిలతో పెళ్ళి అవడానికి అమ్మాయిలకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉండడం
ముఖ్యమైన అర్హత అవడం మొదలైన తరువాత, దానిని సొమ్ము చేసుకొవడానికి ప్రైవేటు
ఇంజనీరింగ్ కాలేజిలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. ఇలా కొత్తగా ప్రారంభం అయిన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజిల లో చాల వరకు రాజకీయ
నాయకులకు చెందినవి లేదా వారికి సన్నిహితంగా ఉన్నవారివే. అవసరానికి మించి ఇంజనీరింగ్ సీట్లు అందుబాటు లోకి రావడం, ఈ కొత్త కాలేజీ లలో
సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడం తో, సహజం గానే ఈ కాలేజీ లలో సీట్లు భర్తీ అవ్వని
పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీసం గా 240 సీట్లు (నాలుగు కోర్సు లకు కలిపి) ఉండే ఇలాంటి
కాలేజీ లలో ఒక విద్యా సంవత్సరం లో 10 సీట్లు కుడా భర్తీ అవ్వక, చిన్న పట్టాణాల దగ్గర
ఉన్న చాలా కాలేజీ లు మూసివేయడం కుడా జరిగింది.
ఇదే సమయం లో 2009 అసెంబ్లీ ఎన్నికలు కోసం తెరపైకి వచ్చిన ఫీజు రియెంబర్సుమెంట్ పథకం తో మూయడానికి
సిద్దంగా ఉన్న ఇలాంటి కాలేజీ లకు- నాణ్యత మెరుగు పరచుకోకుండానే - survive అయ్యే అవకాశం కలిగింది.
అదే సమయం లో, ఫీజు రియెంబర్సుమెంట్ పథకం ద్వారా లక్షల మంది వెనుకబడిన (BC) మరియు ఆర్థికంగా వెనుకబడిన (EBC) కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య లక్ష్యాన్ని
అందుకోగలుగుతున్నారు అని చెప్పడం కుడా సత్యదూరం కాదు. ఒక విద్యార్థి లేదా విధ్యార్థిని చదువుకోవడం అనేది వారి కుటుంబ ఆర్థిక స్థితి మీద కాకుండా
ప్రతిభ, ఆసక్తి ల మీద ఆధారపడిఉండే
పరిస్థితి ఉండాలి అనేది అందరు అంగీకరించే విషయం. ఈ లక్ష్యాన్ని- ఉన్నత విద్య విషయం లోనే అయినా- కొంతవరకు సాధించడానికి ఈ పథకం
ఉపయోగ పడుతోంది. అదే సమయం లో కాలేజి చదువు అనేది- ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా చదువు- విద్యార్థులను ఉద్యోగానికి అర్హులుగా
మార్చి, తద్వారా సంపాదనాపరులుగా మారేందుకు ఉపకరించేది. వృత్తి విద్య, పీజీ
లాంటివి పూర్తి చేసిన 5-6 యేండ్ల కాలం లో చాల మంది విద్యార్థులు ఉద్యోగాలు
పొందగలుగుతున్నారు. ఇంజనీరింగు పూర్తి చేసిన వాళ్ళు ఇంకా తక్కువ సమయం లో కుడా
ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు. కొంతమంది విషయం లో ఇంకొంచెం ఎక్కువ సమయం
పడుతున్నప్పటికీ పెరిగిన ప్రైవేటు ఉద్యోగ అవకాశాల నేపధ్యం లో మెజారిటి
విద్యార్థులు ఈ సమయం లోనే సంపాదన పరులు గా మారగలుగుతున్నారు. At least ఇంజనీరింగ్ సీట్లు తక్కువ గా ఉండి, ఇంజనీరింగ్
ప్రవేశం కోసం అంతో ఇంతో ప్రతిభ అవసరం అయిన ఉండిన సమయం లో అయినా ఇలాంటి పరిస్థితి
ఉండేది .ఇప్పుడు నిజంగా ఇలా జరుగుతోందా? ఇప్పుడు ప్రతి ఏటా పాస్ అవుతున్న
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల లో 15
శాతం మంది కుడా ఉద్యోగానికి
అర్హులు అయిన వారు ఉండడం లేదు అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? విద్యార్ధి ని ఉద్యోగానికి అర్హుడైన వ్యక్తి
గా తయారు చేసే ఇంజనీరింగ్ చదువును,
ప్రతిభ, ఆసక్తి రెండింటి లో ఏదో ఒకటైనా లేని విద్యార్థులకు, ప్రజల డబ్బుతో ఉచితంగా
చదివే అవకాశం ఇవ్వడం దీనికి కారణమా? ఇలా ఇవ్వడం ఎంతవరకు సబబు? ఇలా ఎంత కాలం ఇవ్వగలరు? సహజంగానే ఇది కాలేజీ లలో నాణ్యత లేమికీ, విద్యార్థులలో
బాధ్యతారాహిత్యానికీ దారి తీయదా? బాధ్యత లేని విద్యార్థి బాధ్యతాయుతమైన పౌరుడు
అవుతాడా? విద్యార్థుల ఉన్నత చదువు అవకాశం , రాజకీయ పార్టీ ల, నాయకుల
దయాదాక్షిణ్యాలపై ఎందుకు ఆధారపడి ఉండాలి?
విద్యార్థి కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఉన్నత చదువు కు అడ్దంకి అవ్వకూడదు. అదే సమయం
లో ఉన్నత విద్య చదవడం అనేది ఒక బాధ్యతాయుతమైన విషయం అవ్వాలి. యే విధమైన ఉన్నత
విద్య చదవాలి, దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అనే విషయం విద్యార్ధి ప్రతిభ మరియు ఆసక్తి మీద
మాత్రమే ఆధారపడి ఉండాలి.
మరి ఫీజు రియెంబర్సుమెంట్ కు ప్రత్యామ్నాయం ఏమి లేదా? రాజకీయాలతో సంబంధం
లేకుడా దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించడం సాధ్యమే. ప్రభుత్వ ఆధ్వర్యం లో పని
చేస్తూ కార్యనిర్వాహక స్వయం ప్రతిపత్తి
ఉన్న ఒక సంస్థను నెలకొల్పి, దాని ద్వారా డిగ్రీ కోర్సు లలో చేరే ప్రతి స్టూడెంట్ కు వారి
ఆర్ధిక, సామాజిక స్థితి తో సంబధం లేకుండా Education loan ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇది చదువు పూర్తి అయిన తరువాత 5-10 సంవత్సరాల గడువు లో తీర్చేసేలా
ఉండాలి. వెనుకబడిన తరగతుల మరియు ఆర్థికం గా వెనుకబడిన వారికి నాణ్యమైన ప్రాధమిక
విద్య అంది ఉండదు అనే కారణం తో ఈ Education loan,
వారికి వడ్డీ లేకుండా తిరిగి చెల్లించే అవకాశం ఇవ్వాలి.
మిగతా వారికి చదువు అయిపోయిన 5-10 సంవత్సరాలలో తక్కువ వడ్డీ తో వంతుల వారి గా (EMI) చెల్లించే అవకాశం ఇవ్వాలి. కులం, ఆర్ధిక పరిస్థితి
సంబంధం లేకుండా ఇలా అందరికి ఇలా Education loan ఇవ్వడం మొదలు పెడితే , కొన్ని సంవత్సరాలు గడిచే సమయానికి ఇలా loans
ఇవ్వడానికి తగిన మొత్తం ను సంస్థ
కలిగిఉండడమే కాకుండా వచ్చే ఆదాయం తో నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం మీద ఆధార
పడవలసిన అవసరం ఉండదు. కాలేజీ ఫీజులు పెరిగినప్పుడు ప్రభుత్వం కొంత అదనపు మూలధనం ను
అందించడం ద్వారా అందరికి ఉన్నత విద్య అనే
లక్ష్యం ను సాధించడం సులభం అవుతుంది. ప్రతిభ
లేదా ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఇంజనీరింగ్ లో చేరడం, సౌకర్యాలు, నాణ్యత ను బట్టి
ఫీజు ను నిర్ణయించు కొనే అవకాశం కాలేజి లకు ఉండడం తో కాలేజీ ల మద్య పోటి వాతావరణం పెరిగి రాష్ట్రం
లో క్వాలిటీ ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి వచ్చి విద్యార్థులకు మేలు జరుగుతుంది. అర్హులైన
విద్యార్థుల కంటే ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువ ఉండే పరిస్థితి ఉండదు. అయితే loan తీసుకున్న విద్యార్థులంతా కోర్సు పూర్తి చేస్తారా? మధ్యలో
మానేసే వాళ్ళ మాట ఏమిటి? మరి ఆ డబ్బు ఎలా తిరిగి వస్తుంది? యే విధమైన guarantee
లు లేకుండా ఇచ్చే loan
లను ఎంత వరకు తిరిగి వసూలు చెయ్యగలరు
అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. సరి అయిన విధానాలు రూపొందించడం ద్వారా వీటిని అరికట్టడం
కష్టం కాబోదు. ప్రతి ఏటా ఎంత పెరుగుతుందో తెలియని
మొత్తాన్ని భరించడం కంటే, ఇలాంటి నష్టాలను భరించడం ప్రభుత్వానికి సులభమే.
అందరికి చదువు అనే
సంక్షేమ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి అని చెప్పడం దీని ఉద్దేశం కాదు. విద్యార్థి ఉన్నత చదువు కు పునాది లాంటి ప్రాధమిక
విద్య కు ఫీజు రియెంబర్సుమెంట్ పథకం ఎందుకు అమలు చెయ్యకూడదు? ప్రాధమిక విద్యకు ఫీజు
రియెంబర్సుమెంట్ పథకం అమలు చేస్తే అందరికి విద్యాహక్కు లక్ష్యంను సాధించడానికి
ఉపకరిస్తుంది. ప్రాధమిక విద్య కు ఫీజు రియెంబర్సుమెంట్ పథకం లాంటిది అమలు
చెయ్యకపోవడానికి కారణాలు ఉహించడం కష్టం కాదు.
చాల ప్రైవేటు స్కూల్స్ రాజకీయ నాయకులకు సంబంధించినవి కాకపోవడం, ఆ వయసు
పిల్లల కు ఓటు హక్కు లేకపోవడమే ఆ కారణాలు కాదా? ఏదైనా ఉచితం అనే పథకాలతో వచ్చే
పొలిటికల్ మైలేజి, శాశ్వత పరిష్కారం సాధించే పథకాలకు ఉండదు. సమస్యలను సజీవంగా
ఉంచడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవాలి అని ఆలోచించే నాయకులు ఆ దిశ లో
ఆలోచన చేస్తారా? ఇలాంటి శాశ్వత పరిష్కారం కోసం సమాజం నుండి ఒత్తిడి వస్తే
చెయ్యకుండా ఉండడం సాధ్యం అవుతుందా?